దీనివల్ల తెలంగాణ రాష్ట్రానికి రూ.4 వేల కోట్ల నష్టం
నాస్కామ్ సదస్సులో పాల్గొన్న మంత్రి కెటిఆర్
ముంబయి: తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ముంబయిలో జరుగుతున్న నాస్కాం సదస్సులో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక క్రమశిక్షణ పాటించి అభివృద్ధి దిశగా దూసుకుపోతున్న రాష్ట్రాలను కేంద్రం ప్రోత్సహించాల్సిందిపోయి శిక్షించేలా చర్యలు తీసుకోవడం నిరాశా పూరితమని, తెలంగాణ వంటి రాష్ట్రాలకు ఇది షాక్ కలిగించే చర్యని కెటిఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చే పన్నుల వాటా శాతాన్ని 42 నుంచి 41 శాతానికి తగ్గించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘మీ దృష్టిలో ఇది ఒక్క శాతమే కావచ్చు. కానీ దీనివల్ల మా రాష్ట్రం ఏటా నాలుగు వేల కోట్ల రూపాయలు నష్టపోతుంది. ఇది రాష్ట్రాల అభివృద్దికి విఘాతం కలిగించే చర్య. మీ చర్య వల్ల ప్రగతిశీల రాష్ట్రాలు ఎందుకు నష్టపోవాలి’ అంటూ ట్విట్టర్ వేదికగా కేటీఆర్ కేంద్రాన్ని ప్రశ్నించారు. రాష్ట్రాలకు ఆర్థిక స్వేచ్ఛ ఇవ్వకుంటే కేంద్రం కలలుగంటున్న ఐదు ట్రిలియన్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ అసాధ్యం అని పరోక్షంగా చురకంటించారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/