నిలిచిపోయిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్

సోషల్ మీడియా దిగ్గజాలు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి మెటా ప్లాట్‌ఫామ్‌లు భారత్‌తో పాటు అంతర్జాతీయంగా పలు దేశాల్లో స్తంభించాయి. సాంకేతిక సమస్య కారణంగా మెటాకు చెందిన ఈ సేవలు నిలిచిపోయాయి. కారణం ఏంటో కూడా తెలియదు. అప్పటికే లాగిన్ అయిన వారు కూడా… తమకు తెలియకుండానే లాగౌట్ అయ్యారు. ఎన్నిసార్లు యూజర్ ఐడీ, పాస్ వర్డ్ టైప్ చేసినా లాగిన్ కాలేక, ఏం చేయాలో తోచని పరిస్థితిలో పడ్డారు. ఒకవేళ తమ ఫేస్ బుక్ హ్యాక్ అయిందేమోనని కూడా యూజర్లు అనుమానించే పరిస్థితి ఏర్పడింది.

అయితే, ఈ సమస్య ప్రపంచవ్యాప్తంగా తలెత్తిందని డౌన్ డిటెక్టర్ అనే ట్రాకింగ్ వెబ్ సైట్ వెల్లడించడంతో యూజర్లు కాస్త కుదుటపడ్డారు. ఈ సమస్యపై మెటా ఇంకా స్పందించలేదు. కొంత సమయం తర్వాత ఫేస్ బుక్ మళ్లీ ఓపెన్ అవుతున్నప్పటికీ, ఇన్ స్టాగ్రామ్ మాత్రం సమ్ థింగ్ వెంట్ రాంగ్… రీలోడ్ పేజ్ అనే మెసేజ్ ను ప్రదర్శిస్తోంది. నిత్య జీవితంలో భాగమైపోయిన ఈ ప్లాట్‌ఫామ్‌లు ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోవడంతో 2024లో ఇప్పటివరకు సంభవించిన అతిపెద్ద ఇంటర్నెట్ అంతరాయమని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.