వరంగల్ జిల్లా ధర్మారంలో భారీ అగ్నిప్రమాదం..రూ. 38 కోట్ల మేర ఆస్తి నష్టం

వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం ధర్మారంలో ఉన్న ప్రభుత్వ వస్త్ర సంస్థ (టెస్కో) గోదాంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రభుత్వ టెక్స్‌టైల్ శాఖ ఆధ్వర్యంలో ఈ గోదాము నడుస్తోంది. ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినది అయినప్పటికీ ప్రభుత్వం అద్దెకు తీసుకుని గోదామును నిర్వహిస్తోంది. ఈ గోదాంలో బతుకమ్మ చీరలు, పిల్లలకు సంబంధించిన బెడ్ షీట్లు, క్లాతులు వంటివి నిల్వ ఉంచుతారు. అవసరమైనప్పుడు వాటిని వాడుతుంటారు.

ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ఈ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది.. 3 ఫైరింజన్ల సాయంతో మంటలు ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. భారీ మంటల వల్ల ఇప్పటికే గోదాం గోడలు కూలిపోయాయి. ఈ ప్రమాదం వల్ల దాదాపు రూ. 38 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.