మరోసారి మణిపూర్‌లో రెచ్చిపోయిన దుండగులు.. ముగ్గురి మృతి

Manipur violence.. 3 killed in shoot-out with armed miscreants in Ukhrul

ఇంఫాల్‌ః ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మరోసారి అల్లరి మూకలు రెచ్చిపోయారు. ఉఖ్రుల్‌ జిల్లాలో కొందరు కాల్పులకు తెగబడ్డారు. లిటన్‌ సమీపంలోని కుకీ తెగవారు నివసించే తోవాయి గ్రామం లో శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు గ్రామస్థులు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక పోలీసు అధికారి ఒకరు తెలిపారు. తాజా ఘటనతో ఆ గ్రామంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కాల్పులకు పాల్పడిన వారికోసం రాష్ట్ర పోలీసు, సైన్యం సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్‌ చేపట్టినట్లు వెల్లడించారు.

కాగా, కుకీ, మెయిటీ కమ్యూనిటీల మధ్య నెలకొన్న ఘర్షణలతో దాదాపు మూడు నెలలుగా మణిపూర్‌ అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. ఈశాన్య రాష్ట్రంలో నెలకొన్న జాత్యహంకార ఘర్షణలను చల్లార్చేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినప్పటికీ శాంతి నెలకొనడం లేదు కదా రోజురోజుకూ ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు మరింత క్షీణిస్తున్నాయి. ఈ అల్లర్లు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో సుమారు 180 మందికి పైగా మరణించారు. అనేక మంది కనిపించకుండా పోయారు.