సిఎంపై అనుచిత వ్యాఖ్యలు చేయడమంటే ప్రజలను అవమానించడమేః కాంగ్రెస్ నేత

రేవంత్ రెడ్డిపై కెటిఆర్, హరీశ్ రావులు చేసిన వ్యాఖ్యలను ఖండించిన మల్లు రవి

Congress

హైదరాబాద్‌ః ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఇష్టారీతిన మాట్లాడితే ప్రజలు తిరగబడతారని టీపీసీసీ అధికార ప్రతినిధి మల్లు రవి సోమవారం బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌ను హెచ్చరించారు. కెసిఆర్ కాలి గోటికి కూడా రేవంత్ రెడ్డి సరిపోరని, మూడు ఫీట్లు లేనోడంటూ కెటిఆర్‌, హరీశ్ రావులు చేసిన వ్యాఖ్యలపై మల్లు రవి తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రిపై వారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇలాంటి మాటలు వారి అహంకారానికి పరాకాష్ఠ అన్నారు. ప్రజలు తీర్పు ఇస్తే ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి అయ్యారని… రాష్ట్రంలో విప్లవాత్మక పాలన చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రజారంజకంగా, ప్రజాపాలన చేస్తూ ప్రజల మనసులలో ముఖ్యమంత్రి స్థానం సంపాదించారన్నారు.

ఓ ముఖ్యమంత్రి పట్ల కెటిఆర్‌ అనుచిత వ్యాఖ్యలు చేయడమంటే ప్రజలను అవమానించడమేనని వ్యాఖ్యానించారు. నోటికి వచ్చినట్లు మాట్లాడితే ప్రజలు తిరగబడతారన్నారు. పైగా ముఖ్యమంత్రికి హుందాతనం లేదని హరీశ్ రావు మాట్లాడటం విడ్డూరమన్నారు. ప్రజలకు మరింత చేరువుగా ఉంటూ ప్రజాపాలన అందిస్తూ హుందాగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి పట్ల ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దని… బిఆర్ఎస్ నేతలు తమ పద్ధతిని మార్చుకోవాలని హితవు పలికారు.