గుడివాడలో తీవ్ర ఉద్రిక్తత

గత కొద్దీ రోజులుగా ఏపీలో పలు ఉద్రిక్తత ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ నేతల ఇళ్ల ఫై దాడులు , టీడీపీ శ్రేణుల ఫై దాడులు జరుగుతున్నాయి. తాజాగా గుడివాడలో అదే జరిగింది. టీడీపీ కార్యాలయం పైకి దూసుకొచ్చిన దుండగులు.. పెట్రోల్‌ ప్యాకెట్లు విసిరి నిప్పంటించేందుకు ప్రయత్నించారు. కర్రలు, కత్తులతో దాడి చేశారు. టీడీపీ ఇన్‌ఛార్జి రావి వెంకటేశ్వరరావుకు ఫోన్‌ చేసి చంపేస్తామని వార్నింగ్ ఇచ్చారు.

ఈ దాడికి పాల్పడింది మాజీ మంత్రి అనుచరులే అని స్థానికులు చెబుతున్నారు. అయితే.. టీడీపీ ఆఫీస్ పైకి విసిరిన పెట్రోల్‌ ప్యాకెట్లకు నిప్పంటుకోలేదు. దీంతో పెను ప్రమాదం తప్పింది. లేకుంటే పరిస్థితి మరింత భయానకంగా ఉండేదని ప్రత్యక్ష సాక్షులు చెపుతున్నారు. పెట్రోల్‌ ప్యాకెట్లు విసిరినా, దాడి చేయడానికి వస్తున్నా అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకోకుండా ప్రేక్షకపాత్ర వహించారని బాధితులు చెబుతున్నారు. ఈరోజు (సోమవారం) వంగవీటి రంగా వర్ధంతి నిర్వహించేందుకు టీడీపీ నేతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ సందర్భంలో మాజీ మంత్రి అనుచరుడొకరు టీడీపీ గుడివాడ నియోజకవర్గ ఇన్‌ఛార్జి రావి వెంకటేశ్వరరావుకు ఫోన్‌ చేశారు. రంగా వర్ధంతి నిర్వహించొద్దని హెచ్చరించారు. అంతే కాకుండా ఎక్కువ మాట్లాడితే నిన్ను లేపేస్తా అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారని అంటున్నారు.