భట్టి విక్రమార్క సోదరుడు వెంకటేశ్వర్లు కన్నుమూత

గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం మృతి

mallu-bhatti-vikramarka-brother-passed-away

హైదరాబాద్‌ః తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇంట విషాదం నెలకొంది. భట్టి విక్రమార్క సోదరుడు డాక్టర్ వెంకటేశ్వర్లు ఈ ఉదయం కన్నుమూశారు. ఆయుర్వేద వైద్యుడిగా పని చేస్తున్న వెంకటేశ్వర్లు గత కొంత కాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు మూడు రోజుల క్రితం గుండెపోటు వచ్చింది. దీంతో, ఆయన ఆరోగ్యం క్షీణించి ఈ ఉదయం తుదిశ్వాస వదిలారు. ఆయన వయసు 70 సంత్సరాలు. సోదరుడి మరణంతో భట్టి విక్రమార్క మేడిగడ్డ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఖమ్మం జిల్లాలో స్వగ్రామం స్నానాల లక్ష్మీపురంలో ఈ సాయంత్రం 5 గంటలకు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.

హోమియోలో ఎండీ చదివిన డాక్టర్ వెంకటేశ్వర్లు ఆయుష్ శాఖలో ప్రొఫెసర్ గా, అడిషనల్ డైరెక్టర్ గా పని చేసి రిటైర్ అయ్యారు. ఆ తర్వాత వైరాలో ఉన్న తన నివాసంలో హోమియో వైద్యశాలను నిర్వహిస్తున్నారు. హోమియో వైద్యుడిగా ఆయనకు ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. ఒక సామాజిక బాధ్యతతో ఆయన ఈ ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు.