సస్పెన్షన్కు గురైన ఎంపీల నిరసన.. ఉభయసభలు 2 గంటలకు వాయిదా
న్యూఢిల్లీ: పార్లమెంట్ లో స్మోక్ అటాక్ ఘటనను ఖండిస్తూ ఆందోళన చేపట్టిన 14 మంది ఎంపీలను గురువారం సెషన్ మొత్తం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. సస్పెన్షన్కు గురైన ఆ ఎంపీలు ఈరోజు పార్లమెంట్ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం ముందు నిరసన చేపట్టారు. సస్పెండ్ అయినవారిలో 13 మంది లోక్సభలో, ఒక రాజ్యసభ సభ్యుడు ఉన్నారు. ఆ ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శన చేపట్టారు. ప్రజాస్వామ్యం డౌన్డౌన్ అన్న ప్లకార్డులు పట్టుకున్నారు. సైలెంట్ ప్రొటెస్ట్ టీషర్ట్ ను డెరిక్ ఒబ్రెయిన్ వేసుకున్నారు.
మరో వైపు నేడు ఉభయసభలు వాయిదాపడ్డాయి. లోక్సభ, రాజ్యసభ ప్రారంభంకాగానే.. విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. దీంతో రెండు సభలను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు. స్పీకర్ ఓం బిర్లా ఇచ్చిన ఆదేశాలనే ప్రభుత్వం పాటిస్తోందని పార్లమెంటరీ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. స్మోక్ ఘటన అంశం ప్రస్తుతం కోర్టులో ఉందన్నారు.
కాగా, పార్లమెంట్ మకర ద్వారం వద్ద నిరసన చేపడుతున్న సస్పెండ్ అయిన ఎంపీలను కాంగ్రెస్ పార్టీ నేత సోనియా గాంధీ కలిశారు.