ఫిల్మ్ ఛాంబర్ ఎదుట ‘లైగర్’ ఎగ్జిబిటర్స్ నిరసన..

పూరి – విజయ్ దేవరకొండ కలయికలో వచ్చిన లైగర్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అయినా సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని కొనుగోలు చేసిన ఎగ్జిబిటర్స్ భారీ ఎత్తున నష్టపోయారు. ఈ సినిమా వల్ల నష్టపోయిన వారికి సెటిల్ చేసేందుకు పూరీ జగన్నాథ్ గతంలో అంగీకరించారు. తాజాగా నైజాం ఏరియా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఫిల్మ్ చాంబర్ ఎదుట ఆందోళనకు దిగారు. లైగర్ సినిమాలతో తమకు భారీ నష్టాలు వచ్చాయని, తమను ఆదుకోవాలని నిరసన తెలిపారు. ఆర్థికంగా నష్టపోయిన తమకు పూరీ జగన్నాథ్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు.

ఈ సందర్భంగా తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ.. మేము లైగర్ సినిమా కొనుగోలు చేసి నష్టపోయాం. మాకు న్యాయం చేయాలని నిరవధిక దీక్ష చేస్తున్నామని వివరించారు. లైగర్ సినిమాతో చాలా కష్టాల్లో ఉన్నాం… లీజర్లు అందరూ ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. పూరి డబ్బులన్నీ ఇస్తామని హామీ ఇచ్చారు. ఆరు నెలలు ఆగాము. ఇప్పటికీ డబ్బులు ఇవ్వలేదని ఆగ్రహించారు. పూరి, విజయ్ మాకు న్యాయం చేయాలి… మీ మీద ఎలాంటి కోపం లేదు.. మేము చిన్న వాళ్ళము. మమ్మల్ని ఇప్పుడు రోడ్డు మీదకు తెచ్చారని మండిపడ్డారు. ఫిల్మ్ ఛాంబర్ లో లెటర్ ఇచ్చాము. ఒక్కో ఎగ్జిబిటర్ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై సినీ నటి చార్మీ స్పందించింది. ఈ అంశం తమ దృష్టికి వచ్చిందని, త్వరలో వారికి అనుకూలంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.