‘లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్’..భారీగా తరలివస్తున్న అభిమానులు

బాబు అభిమానులు పోటెత్తడంతో మియాపూర్ మెట్రో స్టేషన్ కాసేపు మూసివేత

let’s-metro-for-cbn-police-alerted-at-metro-station

హైదరాబాద్‌ః టిడిపి అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ ఈరోజు తలపెట్టిన ‘లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్’ కార్యక్రమానికి బాబు అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. నేడు మియాపూర్ నుంచి ఎల్‌బీనగర్ వరకూ మెట్రోలో నల్ల టీషర్టులు ధరించి ప్రయాణిస్తూ శాంతియుతంగా నిరసన తెలిపేందుకు చంద్రబాబు అభిమానులు నిర్ణయించిన విషయం తెలిసిందే.

ఈ నిరసన కార్యక్రమం నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రవేశ ద్వారాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. నల్లచొక్కాలు ధరించిన వారిని లోపలకు అనుమతించడం లేదు. చంద్రబాబు అభిమానులు భారీగా తరలిరావడంతో మియాపూర్ మెట్రో స్టేషన్‌ను సిబ్బంది కాసేపు తాత్కాలికంగా మూసేశారు. అనంతరం, ప్రయాణికులను అనుమతించారు.

మరోవైపు, ఎల్బీనగర్ మెట్రోస్టేషన్ వద్ద నల్ల టీషర్టు వేసుకుని వచ్చిన కొందరు యువకులను అడ్డుకోవడంతో వారు పక్కనే ఉన్న డీ మార్టులోకి వెళ్లి ఇతర రంగు టీషర్టులు కొనుగోలు చేసి వస్తున్నారు.