అక్కడ రఘురాజును నిలబెడదాంః చంద్రబాబు

Let’s field Raghuramakrishna Raju as Narasapuram Lok Sabha candidate Chandrababu!

అమరాతిః ఏపీలో కూటమిగా పోటీ చేస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సీట్ల సర్దుబాట్లు జరుగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి అసెంబ్లీ స్థానాన్ని టీడీపీకి ఇచ్చేందుకు బీజేపీ సూత్రప్రాయంగా అంగీకరించింది. దీనికి బదులుగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లె సీటును బీజేపీ తీసుకునే అవకాశం ఉంది.

నిన్న ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో కూటమి నేతల భేటీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, పురందేశ్వరి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సిద్ధార్థ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు. దాదాపు రెండు గంటల సేపు భేటీ కొనసాగింది. ఈ సమావేశంలో అభ్యర్థుల మార్పు విషయంపై చర్చించారు.

మరోవైపు ఎంపీ రఘురామకృష్ణరాజు టికెట్ విషయంపై కూడా వీరు చర్చించారు. నరసాపురం లోక్ సభ స్థానాన్ని టీడీపీకి వదిలేయాలని, అక్కడ రఘురాజును నిలబెడతామని చంద్రబాబు ప్రతిపాదించారు. దీనికి బదులుగా ఉండి అసెంబ్లీ స్థానాన్ని తీసుకుని, అక్కడి నుంచి నరసాపురం లోక్ సభ అభ్యర్థి శ్రీనివాసవర్మను పోటీ చేయించాలని సూచించారు. ఈ ప్రతిపాదనను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తామని బీజేపీ నేతలు చెప్పారు.