బిజెపి కండువా కప్పుకున్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి

కాంగ్రెస్ సీనియర్ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి..కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి బిజెపి పార్టీ లో చేరారు. గురువారం ఢిల్లీలో బీజేపీలో జేపీ నడ్డా సమక్షంలో బిజెపి కండువా కప్పుకున్నారు. ఈ సందర్బంగా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ..మోడీ వల్ల తెలంగాణలో అరాచక పాలనకు అంతం వస్తుందని ..మోడీ నాయకత్వంలో బీజేపీ పార్టీ బలోపేతం కోసం పని చేస్తానని తెలిపారు.

కేసీఆర్ అరాచక పాలన అంతం చేయటం బీజేపీకే సాధ్యమని, అందుకే తాను బీజేపీలో చేరానని తెలిపారు. కొంతకాలం నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి అడుగులు వేస్తున్నాయని, రెండు పార్టీలు కూడా కలిసికట్టుగా పని చేస్తున్నాయన్నారు. అవినీతిపై పోరాటం చేయాల్సిన కాంగ్రెస్ పార్టీ.. నిస్తేజంగా ఉందన్నారు. బీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తు ఉంటుందని కొందరు సీనియర్స్ అంటే.. పొత్తు లేదని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారని.. క్లారిటీ, నిబద్దత లేదని.. అంతా గందరగోళంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు ఉన్నారని.. పార్టీ వాళ్లు వ్యాఖ్యలు చేస్తూ.. కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తున్నారని అన్నారు.

AICC కార్యక్రమాల కమిటీ ఛైర్మన్‌‌గా ఉన్న మహేశ్వరరెడ్డి.. గత కొంత కాలం నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీకి దగ్గరవుతున్నారని మహేశ్వరరెడ్డికి కాంగ్రెస్‌ పార్టీ షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. ఈ క్రమంలో తనకు నోటీస్‌ ఇచ్చే అధికారం టీపీసీసీకి లేదని స్పష్టం చేసిన మహేశ్వరరెడ్డి.. ఖర్గేను కలుస్తానని ఢిల్లీ వచ్చారు. అనంతరం జరిగిన పరిణామాలతో బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈటలతో కలిసి గురువారం ఉదయం మహేశ్వర్ రెడ్డి తరుణ్‌ చుగ్‌ నివాసానికి చేరుకుని భేటీ అయ్యారు. బండి సంజయ్, ఈటల రాజేందర్, తరుగ్ చుగ్ తో సమావేశం అనంతరం అక్కడి నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను కలిసి ఆయన సమక్షంలో పార్టీ లో చేరారు.