ప్రాణం పోయేవరకు కూడా కాంగ్రెస్ లోనే ఉంటా – కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..కాంగ్రెస్ ను వీడి బిజెపి లో చేరబోతారని , సోదరుడి బాటలోనే నడుస్తాడని , అందుకే మునుగోడు ఎన్నికలకు దూరంగా ఉంటున్నారని ఇలా ఎవరికీ వారు మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వాటిపై క్లారిటీ ఇచ్చారు. తన ప్రాణం పోయేవరకు కూడా కాంగ్రెస్ లోనే ఉంటానని తేల్చి చెప్పారు. గురువారం గుండాలలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన తాను చనిపోయేదాకా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని తెలిపారు. ఈ మేరకు తాను పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి మాట ఇచ్చానని చెప్పుకొచ్చారు. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించే సమయంలో సోనియా గాంధీతో తాను జరిపిన సంభాషణను కోమటిరెడ్డి ప్రస్తావించారు.
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేస్తున్నామని, మీరంతా కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలని తమను సోనియా గాంధీ కోరారని వెంకట్ రెడ్డి అన్నారు. ఆ మాటకు ప్రతిగా తాను చనిపోయే దాకా కాంగ్రెస్ పార్టీని వీడబోనని సోనియాకు మాట ఇచ్చానని తెలిపారు. కాంగ్రెస్ అంటే కోమటిరెడ్డి అన్న ఆయన… కోమటిరెడ్డి అంటే కాంగ్రెస్ అని వ్యాఖ్యానించారు. తాను పార్టీ పదవిని మాత్రమే ఆశించానన్న వెంకట్ రెడ్డి… మంత్రి, ముఖ్యమంత్రి పదవులు తనకు అవసరం లేదని అన్నారు.