జైల్లో దోమలు కుట్టక రంభా, ఊర్వశి, మేనక కన్ను కొడతారా? : కొడాలి నాని వ్యంగ్యం

చంద్రబాబు రాజకీయాల్లో ఉంటే గెలుపు వైస్సార్సీపీ దేనన్న మాజీ మంత్రి

kodali nani as ap state development board chairman
kodali-nani-comments-on-tdp-leaders

అమరావతి : ఏపీ మాజీ మంత్రి, గుడివాడ వైస్సార్సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని మరోసారి టిడిపి అధినాయకత్వంపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు అరెస్ట్ అయితే పొరుగు రాష్ట్రం నేతలను బతిమాలి మాట్లాడిస్తున్నారని కొడాలి నాని విమర్శించారు. జైల్లో దోమలు కుడుతున్నాయి అంటున్నారు… మరి దోమలు కుట్టక రంభా, ఊర్వశి, మేనకలు వచ్చి కన్ను కొడతారా? అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు రాజకీయాల్లో ఉన్నంతకాలం వైస్సార్సీపీ గెలుపునకు ఢోకా లేదని అన్నారు.

వాడెవడో స్టార్ వస్తే… లోకేశ్ వాడ్ని అన్నయ్యా అంటున్నాడని ఎత్తిపొడిచారు. ఓ పక్కన్న మామయ్య, మరో పక్కన అన్నయ్యను పెట్టుకుని లోకేశ్ ఏంచేయాలనుకుంటున్నాడని ప్రశ్నించారు. తండ్రి అరెస్ట్ అయితే, తిరునాళ్లలో తప్పిపోయిన పిల్లవాడిలా లోకేశ్ బిత్తరచూపులు చూశాడని వ్యంగ్యం కొడాలి నాని వ్యాఖ్యానించారు.

చాతనైతే జైల్లో పెట్టండన్న చంద్రబాబు ఇప్పుడు బెయిల్ కోసం కోర్టుల వెంట తిరుగుతున్నాడని వ్యంగ్యం ప్రదర్శించారు. చంద్రబాబు వయసును సాకుగా చూపించాలనుకుంటున్నారని, కానీ అన్ని ఆధారాలు ఉండబట్టే కోర్టు కస్టడీకి అప్పగించిందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇన్నర్ రింగ్ రోడ్డు సహా అన్నీ స్కాములేనని, ఏపీలో సింపతీ గేమ్స్ పనిచేయవని కొడాలి నాని స్పష్టం చేశారు.