కిషన్ రెడ్డి కమిట్మెంట్ కలిగిన నాయకుడుః బండి సంజయ్

Kishan Reddy is a committed leader: Bandi Sanjay

హైదరాబాద్ః తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల అధ్యయనం కోసం త్వరలో పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసే అవకాశమున్నట్లు వార్తలు రావడంపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ స్పందించారు. పీఆర్సీ కమిషన్ వేస్తున్నట్లు లీకులు ఇస్తున్నారని, పీఆర్సీ వేసినా ప్రభుత్వం అమలు చేయదని విమర్శించారు. ఎన్నికలు వస్తున్నాయంటే చాలు నాటకాలు మొదలు పెడతారని దుయ్యబట్టారు. బీసీలు అందరూ బిజెపికి ఓట్లు వేస్తారనే రూ.1 లక్ష సాయమంటూ బీసీ బంధును తీసుకు వచ్చారన్నారు. కెసిఆర్ అన్ని కులవృత్తులను నాశనం చేశారన్నారు.

కిషన్ రెడ్డి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కార్యక్రమంలో సంజయ్ మాట్లాడారు. తనకు అన్నలాంటి వాడు కిషన్ రెడ్డి అని, ఆయన కమిట్మెంట్ అందరికీ తెలిసిందే అన్నారు. బిజెపి కార్యాలయంలోనే ఉంటూ చదువుకొని, ఈ స్థాయికి వచ్చారని, అప్పటి నుండి పార్టీ కోసమే పని చేస్తున్నారన్నారు. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ మూర్ఖత్వపు, వారసత్వ పాలనపై ఉద్యమిస్తామన్నారు.

పార్టీ కార్యకర్తలు అందరూ హీరోలు అని, మహిళలు ఝాన్సీరాణీలు అని, మీ అందరికీ హ్యాట్సాప్ అన్నారు. బీజేపీ కార్యకర్తలు వెళ్లి భాగ్యలక్ష్మి దేవాలయం వద్ద గొంతెత్తి నినదించే వరకు ఏ పార్టీ వెళ్లలేదని విమర్శించారు. ఈ రోజు కాంగ్రెస్ నాయకులు కూడా వెళ్లి చార్‌మినార్ అనకుండా భాగ్యలక్ష్మి అమ్మవారు అన్నారని, ఇది బిజెపి కార్యకర్తల విజయం అన్నారు. బిఆర్ఎస్ కార్యకర్తలు కూడా అదే చెప్పారన్నారు. అది చార్‌మినార్ కాదు.. భాగ్యలక్ష్మీ అమ్మవారి అడ్డ అన్నారు. దీనికంతటికీ బిజెపి కార్యకర్తలేనని, ఇదీ మన కార్యకర్తల దమ్ము అన్నారు.