ద‌క్షిణ కొరియాకు కిమ్ సోద‌రి వార్నింగ్‌

మా జోలికొస్తే అణ్వాయుధాలతో దాడి చేస్తాం.. కిమ్ సోదరి

ప్యోంగ్యాంగ్: ఉత్త‌ర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ సోద‌రి కిమ్ యో జాంగ్ ద‌క్షిణ కొరియాకు గ‌ట్టి వార్నింగ్ ఇచ్చింది. తమపై దాడికి దిగితే అణ్వాయుధాలతో దక్షిణ కొరియా సైన్యం అంతు చూస్తామని ప్రకటించారు. కిమ్ తర్వాత రెండో అత్యంత శక్తిమంతురాలిగా కిమ్ యో జాంగ్ ఉన్నారు. ఉత్తర కొరియా యుద్ధాన్ని వ్యతిరేకిస్తుందని ఆమె అన్నారు. అయితే, ఒకవేళ దక్షిణ కొరియా సైనిక దాడిని లేదా ముందస్తు దాడిని ఎంచుకుంటే కనుక అణ్వాయుధాలతో దాడి చేస్తామని ఆమె ప్రకటించారు.

ఉత్తర కొరియా ప్రభుత్వంలో సీనియర్ గా కిమ్ యో జాంగ్ వ్యవహరిస్తున్నారు. దక్షిణ కొరియా రక్షణ మంత్రి సుహ్ వుక్ ఇటీవల ఉత్తర కొరియాపై దాడుల గురించి వ్యాఖ్యానించడం పెద్ద తప్పిదంగా ఆమె పేర్కొన్నారు. గత శుక్రవారం దక్షిణ కొరియా రక్షణ మంత్రి మాట్లాడుతూ.. ఉత్తర కొరియా క్షిపణులను ప్రయోగిస్తుందన్న స్పష్టమైన సంకేతాలు ఉంటే.. ఆ దేశంలోని ఏ లక్ష్యాన్ని అయినా కచ్చితంగా, వేగంగా కొట్టి పడే క్షిపణులు తమ వద్ద ఉన్నాయని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే కిమ్ యో జాంగ్ తీవ్రంగా స్పందించారు. ‘‘అణ్వాయుధ శక్తి అన్నది శత్రుదేశాలను నిరోధించేందుకే. కానీ, సాయుధ పోరాటం అనివార్యమైతే కనుక శత్రు దేశం సైనిక దళాలను అణ్వాయుధాలు తుడిచిపెట్టేస్తాయి’’ అని ఆమె పేర్కొన్నారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/