ఆన్‌లైన్ పెళ్లికి కేరళ హైకోర్టు గ్రీన్ సిగ్నల్

తిరువనంతపురం: కేరళకు చెందిన న్యాయవాది రింటు థామస్ (25), అనంత కృష్ణన్ హరికుమార్ నాయర్‌లు నిన్న పెళ్లి చేసుకుని దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టాలని భావించారు. అయితే, ఒమిక్రాన్ రూపంలో వచ్చిన కరోనా వైరస్ వారి వివాహాన్ని అడ్డుకుంది. బ్రిటన్‌లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న నాయర్ బుధవారమే స్వదేశానికి రావాల్సి ఉండగా, ఒమిక్రాన్ నేపథ్యంలో ప్రయాణ ఆంక్షలు ఉండడంతో రాలేకపోయారు. ఫలితంగా వీరి వివాహం ఆగిపోయింది.

దీంతో రింటు కేరళ హైకోర్టును ఆశ్రయించారు. ఆన్‌లైన్‌లో వివాహం చేసుకునేందుకు అనుమతించేలా రాష్ట్ర ప్రభుత్వం, తిరువనంతపురంలోని సబ్ రిజిస్ట్రార్‌లను ఆదేశించాలని అభ్యర్థించారు. ఆమె పిటిషన్‌ను పరిశీలించిన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.నగరేశ్ అందుకు అంగీకరించారు. కరోనా సమయంలో ఆన్‌లైన్ వివాహాలకు అనుమతినిచ్చిన నేపథ్యంలో ఇప్పుడు కూడా దానిని అమలు చేయవచ్చని తెలిపారు. వారి పెళ్లికి తగిన ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/