ఇజ్రాయెల్లో భారతీయుల భద్రతకు భరోసా ఇవ్వాలిః జైశంకర్కు కేరళ సిఎం లేఖ
న్యూఢిల్లీ : ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్లో భారతీయుల భద్రత కోసం చర్యలు చేపట్టాలని కోరుతూ కేరళ సీఎం పినరయి విజయన్ విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్కు లేఖ రాశారు. హమాస్ ఉగ్రవాదులు, ఇజ్రాయెల్ బలగాల మధ్య భీకరదాడులు కొనసాగుతున్న క్రమంలో అక్కడున్న కేరళ ప్రజలతో పాటు భారతీయుల భద్రత కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. ఇజ్రాయెల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం కేరళకు చెందిన పలువురిని కష్టాల్లోకి నెడుతుండగా వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని లేఖలో కేరళ సీఎం విజయన్ వివరించారు.
ఇజ్రాయెల్లో మన పౌరుల భద్రత కోసం మీరు చొరవ తీసుకుని చర్యలు చేపట్టాలని జైశంకర్కు ఆయన విజ్ఞప్తి చేశారు. ఇజ్రాయెల్పై హమాస్ ఉగ్రమూకలు శనివారం చేపట్టిన మెరుపు దాడులతో వందలాది మంది మృత్యువాతన పడగా, వేలాది మంది గాయాలపాలై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ ప్రతిదాడులతో హమాస్ స్ధావరాలపై విరుచుకుపడుతోంది.