కేసీఆర్ టూర్ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల నేతల అరెస్ట్

తెలంగాణ సీఎం కేసీఆర్ ఈరోజు ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆ జిల్లాలోని ప్రతిపక్ష పార్టీల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల రాష్ట్రంలో కురిసిన వర్షాలకు భారీగా పంట నష్టం జరిగిన విషయం తెలిసిందే. పర్యటనలో వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించడంతో పాటు రైతులను పరామర్శించనున్నారు. ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో పర్యటించి రైతులను కలిసి పరామర్శించి వారికి భరోసా కల్పించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు ఇప్పటికే పంట నష్టం గురించి నివేదికను సిద్ధం చేశారు. అయితే నష్టపోయిన రైతులకు పరిహారం కూడా అందించనున్నట్టు సమాచారం.

ఈ క్రమంలో పోలీసులు కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ఆందోళనలు, నిరసనలు చేస్తారనే కారణంతో ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పోలీసుల అదుపులోకి తీసుకుంటున్నారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలో నాయకుల ముందస్తు అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తొర్రూరు, పెద్దవంగర మండలాల్లోని బీజేపీ, కాంగ్రెస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే మరిపెడలోనూ కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం నాయకులు, అంగన్ వాడీ కార్యకర్తలను సైతం ముందస్తుగా పోలీసులు అరెస్ట్ చేశారు. కేసముద్రం, నెళ్లికుదురు, మండలాల్లో కాంగ్రెస్, బీజేపీ నాయకులను అరెస్టు చేశారు. డోర్నకల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ ఎంఎల్ పార్టీ నాయకులను ముందస్తు అరెస్ట్ చేశారు.