మరోసారి తన పెద్ద మనసు చాటుకున్న కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. అరుదైన వ్యాధి తో బాధపడుతున్న యువతికి..రూ. 25 లక్షలు అందజేసి వార్తల్లో నిలిచారు. వనపర్తి జిల్లా రేవల్లికి చెందిన శివాని అనే యువతి ‘పారక్సిస్మల్‌ నాక్టర్నల్‌ హిమోగ్లోబినురియా’ (పీఎన్‌ఎన్‌) అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఈ వ్యాధి నుండి ఆమె బయటపడాలంటే..రూ.30 లక్షల వరకు ఖర్చవుతుందని డాక్టర్లు తెలిపారు. క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించే ఆ యువతీ తండ్రి..అంత డబ్బు ఎక్కడి నుండి తేవాలని బాధపడుతూ..తన కష్టాన్ని మంత్రి నిరంజన్‌రెడ్డితో చెప్పుకున్నాడు.

ఈ విషయాన్ని ఆయన కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన వెంటనే సీఎం సహాయ నిధి నుంచి రూ.25లక్షలు మంజూరు చేశారు. దీనికి సంబంధించిన చెక్కును మంత్రి నిరంజన్‌రెడ్డి మంగళవారం యువతి కుటుంబానికి అందజేశారు. శివాని కుటుంబం 20 ఏళ్ల కింద బతుకుదెరువు కోసం హైదరాబాద్‌లోని పీర్జాదీగూడకు వచ్చి స్థిరపడింది. బాల్‌రెడ్డి క్యాబ్‌డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన సాయానికి రుణపడి ఉంటామని బాల్‌రెడ్డి కుటుంబ సభ్యులు తెలిపారు.