జగనన్న ఫై మరోసారి తన ప్రేమను చాటుకున్న రోజా..

వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా ..మరోసారి జగన్ ఫై తన ప్రేమను , అభిమానాన్ని చాటుకుంది. జగన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం తిరుపతి లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటన లో పలు అభివృద్ధి కార్య క్రమాలు చేపట్టారు. నిన్న తిరుపతి వచ్చిన ఆయనకు వైసీపీ నేతలు ఘనస్వాగతం పలికారు.

నగరి ఎమ్మెల్యే రోజా తనదైన శైలిలో సీఎం జగన్ ను సత్కరించారు. ప్రత్యేకంగా తయారుచేయించిన శాలువాను ఆయనకు కప్పారు. ఆ శాలువాపై అన్నీ జగన్, వైఎస్సార్ బొమ్మలే ఉండడం విశేషం. సీఎం రాకను పురస్కరించుకుని ఆ పట్టు శాలువాను రోజా దగ్గరుండి మరీ తయారుచేయించారు. ఇక తిరుపతి పర్యటన విషయానికి వస్తే..శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. శ్రీపద్మావతి చిన్న పిల్లల కార్డియాక్‌ సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం అలిపిరి శ్రీవారి పాదాల మండపం వద్దకు చేరుకొని అలిపిరి నుంచి తిరుమల జీఎన్‌సీ టోల్‌గేట్‌ వరకు పునర్నిర్మించిన నడకమార్గం పైకప్పును ప్రారంభించారు. అనంతరం గోమాతకు ప్రత్యేక పూజలు చేసి శ్రీవేంకటేశ్వర సప్తగోప్రదక్షిణ మందిరాన్ని, గోతులాభారం ప్రారంభించారు.

శ్రీవేంకటేశ్వరస్వామి భక్తి ఛానల్‌కు సంబంధించి ఎస్వీబీసీ కన్నడ, హిందీ ఛానళ్లను సీఎం ప్రారంభించారు. అనంతరం శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీ కోసం రూ.10 కోట్లతో నిర్మించిన నూతన బూందీపోటు భవనాన్ని ప్రారంభించారు. అనంతరం అన్నమయ్య భవన్‌లో రైతు సాధికార సంస్థ, టీటీడీ మధ్య జరిగే ఒప్పంద కార్యక్రమంలో పాల్గొన్నారు.