తెలంగాణ భవన్ చేరుకున్న కెసిఆర్‌

KCR reached Telangana Bhavan

హైదరాబాద్ః బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ భవన్ కు వచ్చారు. తెలంగాణ భవన్ కు ఆయన మూడు నెలల తర్వాత రావడం గమనార్హం. ఈ సందర్భంగా మహిళా ప్రజాప్రతినిధులు ఆయనకు హారతి ఇచ్చి ఆహ్వానం పలికారు. కృష్ణా జలాల పరిరక్షణ సభ ఏర్పాట్లను కెసిఆర్ సమీక్షించనున్నారు. కృష్ణా బేసిన్ లో ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం కేఆర్ఎంబీకి అప్పగించడంపై పోరుబాటకు సంబంధించిన కార్యాచరణపై నేతలకు కేసీఆర్ మార్గనిర్దేశం చేయనున్నారు.

ఇక ఈనాటి కెసిఆర్ సమీక్షా సమావేశానికి ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. పార్టీ కీలక నేతలు కెటిఆర్, హరీశ్ రావు కూడా తెలంగాణ భవన్ కు వచ్చారు. అసెంబ్లీ సమావేశాలు, రాష్ట్ర కేబినెట్ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలపై కూడా చర్చించనున్నారు.