కస్టడీపై ట్విట్టర్ లో స్పందించిన సిసోడియా

‘నన్ను జైలులో పెట్టి ఇబ్బందులకు గురిచేయగలరు కానీ నా సంకల్పాన్ని ఏమాత్రం దెబ్బతీయలేరు..’

you-cannot-break-my-spirit-says-manish-sisodia-on-probe-agency-custody

న్యూఢిల్లీః ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో మనీశ్‌ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఈడీ కస్టడీలో ఉన్నారు. తాజాగా సిసోడీయా ట్విటర్‌ వేదికగా స్పందించారు.‘నన్ను జైలులో పెట్టి ఇబ్బందులకు గురిచేయగలరు కానీ నా సంకల్పాన్ని ఏమాత్రం దెబ్బతీయలేరు..’ అంటూ శనివారం పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెట్టారు.

ఈ కేసుకు సంబంధించి మనీలాండరింగ్ వ్యవహారంపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం సిసోడియాను తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు. ఈడీ అధికారుల విజ్ఞప్తిని మన్నించిన కోర్టు.. ఏడు రోజుల పాటు కస్టడీకి అప్పగిస్తూ తీర్పిచ్చింది. ఈ నేపథ్యంలో మనీశ్ సిసోడియా టీమ్ ట్విట్టర్ లో స్పందించింది.

స్వాతంత్ర్య పోరాటంలో కూడా ఆంగ్లేయులు ఇదే విధానాన్ని అవలంభించారని సిసోడియా తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఫ్రీడమ్ ఫైటర్లను జైలులో పెట్టి, వారి నైతిక స్థైర్యం దెబ్బతీసేందుకు ప్రయత్నించారని గుర్తుచేశారు. అప్పుడు ఆంగ్లేయులు అవలంభించిన విధానాన్నే ఇప్పుడు అధికారులు పాటిస్తున్నారని ఆరోపించారు. తనను జైలులో పెట్టడం, ఇబ్బందులకు గురిచేయడం మాత్రమే వారికి చేతనవుతుందని సిసోడియా చెప్పారు. తన సంకల్పాన్ని కదిలించడం మీవల్ల కాదంటూ ట్వీట్ చేశారు.