టిఆర్ఎస్ ప్రజాదీవెన సభ కు కర్నే ప్రభాకర్ దూరం

మరికాసేపట్లో మునుగోడు లో టిఆర్ఎస్ ప్రజాదీవెన సభ ప్రారంభం కాబోతుంది. అయితే ఈ సభ కు పార్టీ మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ దూరంగా ఉండనున్నారు. కరోనా సోకడంతో ఆయన ఈ సభకు హాజరుకాలేకపోతున్నారు. ఈ మేరకు ఓ వీడియోను రిలీజ్ చేశారు. గత రెండు రోజులుగా తీవ్రమైన జ్వరం ఉందని, టెస్టు చేసుకుంటే పాజిటివ్ గా తేలిందని తెలిపారు. వైద్యుల సలహాల మేరకు హోం ఐసోలేషన్ లో ఉన్నానని అన్నారు. మునుగోడు భారీ బహిరంగ సభకు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై సభను విజయవంతం చేయాలని ఆయన కొరారు.

2004 ఎన్నికల్లో టిఆర్ఎస్ తరఫున మునుగోడు నుంచి పోటీ చేసి ఓడిపోయారు కర్ణే ప్రభాకర్. ఆ తర్వాత 2009లో పొత్తుల కారణంగా పోటీ చేయలేకపోయారు. ఇక 2014 ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న ఆయనకి అవకాశం దక్కలేదు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్న కర్నే ప్రభాకర్ ను గతంలో శాసనమండలి సభ్యునిగా నియమించారు. గవర్నర్ నామినేటెడ్ కోటాలో ఆయనను ఎమ్మెల్సీగా నియమించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం తో మునుగోడు కు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని టిఆర్ఎస్ , కాంగ్రెస్ , బిజెపి పార్టీ లు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఈరోజు జరిగే టిఆర్ఎస్ సభ లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ని ప్రకటించే అవకాశం ఉంది.

హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 12:30కు రోడ్డు మార్గంలో మునుగోడు కు సీఎం రానున్నారు. నాలుగువేల కార్ల భారీ కాన్వాయ్ తో మునుగోడుకు కేసీఆర్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 4గంటల వరకు హైదరాబాద్- విజయవాడ హైవేపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల వరకు చిట్యాల నుంచి రామన్నపేట మీదుగా ట్రాఫిక్ మళ్లించనున్నారు. మునుగోడు సభలో సాయంత్రం 4గంటలకు సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. ముఖ్యమంత్రి సభ కోసం 2 వేల మంది పోలీసులతో భారీ బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నారు. ఐదుగురు ఎస్పీలు, ఆరుగురు అదనపు ఎస్పీలు, 25 మంది డిఎస్పీలు, 50మంది సీఐలు, 94 మంది ఎస్సైలు విధుల్లో పాల్గొననున్నారు.