ఈద్ ఊరేగింపు..ఇరు వర్గాల మధ్య ఘర్షణ..43 మంది అరెస్ట్
బెంగళూర్ : ఈద్ ఊరేగింపు సందర్భంగా కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలకు సంబంధించి 43 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఘర్షణలు చెలరేగిన రాగిగద్దలో సోమవారం 144 సెక్షన్ విధించారు. ఇతర మతాల వారి ఊరేగింపులపై రాళ్లు విసిరే వారిని ఉపేక్షించబోమని కర్నాటక సీఎం సిద్ధరామయ్య హెచ్చరించారు.
రాగిగద్దలో ప్రస్తుతం పరిస్ధితి అదుపులో ఉందని చెప్పారు. ఏ మతానికి చెందిన ఊరేగింపుపైనా ఇతరులు రాళ్లు వేయడం, అసౌకర్యం కలిగించడం సరైంది కాదని అన్నారు. అలాంటి కార్యకలాపాలను తమ ప్రభుత్వం ఉపేక్షించబోదని సిద్ధరామయ్య స్పష్టం చేశారు.
మిలాడినబి ఊరేగింపులపై కొందరు దాడులకు దిగిన ఘటనలతో కొన్ని చోట్ల ఇబ్బందులు ఎదురయ్యాయని పోలీసులు తెలిపారు. నిరసనకారులు బారికేడ్లను దాటి ముందుకురావడంతో గుంపును చెదరగొట్టేందుకు లాఠీచార్జి చేశామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈద్ ఘర్షణల్లో ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు.