ముద్రగడ పై కాపు సంక్షేమ సేన ఆగ్రహం

వైఎస్‌ఆర్‌సిపికి ముద్రగడ అమ్ముడుపోయారన్న కృష్ణాంజనేయులు

mudragada-padmanabham

అమరావతిః వైఎస్‌ఆర్‌సిపికి అమ్ముడుపోయాడంటూ ముద్రగడ పద్మనాభంపై కాపు సంక్షేమ సంఘం నేతల మండిపడ్డారు. వ్యక్తిగత స్వార్థం కోసం కాపు జాతిని తాకట్టు పెట్టొద్దని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ముద్రగడ రాసిన లేఖ కాపు జాతి తల దించుకునేలా ఉందని కాపు సంక్షేమ సేన నేత కృష్ణాంజనేయులు మండిపడ్డారు. ఈ లేఖతో ఆయన స్థాయిని ఆయనే దిగజార్చుకున్నారని విమర్శించారు. అన్నీ వదిలేసి ఇంట్లో కూర్చున్న ముద్రగడ ఇప్పుడు లేఖ రాయడం వెనకున్న ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. పవన్ ను కేవలం సినీ హీరోగా సంబోధించడం వెనుక పెద్ద కుట్ర ఉందనే విషయం అర్థమవుతోందని చెప్పారు.

కాపు మహిళలను కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి కొడితే ముద్రగడ ఎందుకు స్పందించలేదని కృష్ణాంజనేయులు ప్రశ్నించారు. పవన్ ను, ఆయన కుటుంబ సభ్యులను వైఎస్‌ఆర్‌సిపి నేతలు బూతులు తిట్టినప్పుడు ఎక్కడున్నారని మండిపడ్డారు. జిల్లాకు వంగవీటి రంగా పేరును పెట్టాలని ఎందుకు డిమాండ్ చేయలేదని ప్రశ్నించారు. కాపు ఉద్యమం వల్ల నష్టపోయిన వారిని ఏరోజైనా పరామర్శించారా? అని నిలదీశారు. కాపు రిజర్వేషన్లను ఇవ్వను అని చెప్పిన జగన్ కు మద్దతు ఎలా ఇస్తున్నారని దుయ్యబట్టారు. కాపు జాతిని తాకట్టు పెట్టొద్దని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.