నందమూరి కుటుంబంలో విషాదం.. ఎన్టీఆర్​ కుమార్తె ఉమామహేశ్వరి ఆత్మహత్య

దివంగత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌ చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నారు. మానసిక సమస్యలు, ఒత్తిడి కారణంగా ఉమా మహేశ్వరి బలవన్మరణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మధ్యాహ్నం ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. గదిలోకి వెళ్లిన ఆమె ఎంతసేపటికి డోర్ ఓపెన్ చేయకపోవడంతో తలుపులు గట్టిగా పగలగొట్టి చూడగా విగతజీవిగా పడిఉండడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన జూబ్లీహిల్స్‌ పోలీసులు మధ్యాహ్నం 2.45 గంటలకు ఉమామహేశ్వరి ఇంటికి చేరుకున్నారు.

ఆమె మరణ వార్త తెలియగానే నందమూరి బాలకృష్ణ, రామకృష్ణతో పాటు ఇతర కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసానికి చేరుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, భువనేశ్వరి, లోకేశ్‌, బ్రాహ్మణి ఆమె ఇంటికి వెళ్లారు. అలాగే నందమూరి కల్యాణ్‌ రామ్‌ అక్కడికి చేరుకున్నారు. ఉమామహేశ్వరికి ఇద్దరు కుమార్తెలు ఉండగా.. చిన్న కుమార్తెకు ఇటీవలే వివాహం జరిగింది. పెద్ద కుమార్తె విశాల అమెరికా నుంచి రావాల్సి ఉంది. ఉమామహేశ్వరి అంత్యక్రియలు బుధవారం జరిగే అవకాశం ఉంది. మరోవైపు, పోస్టుమార్టం కోసం ఉమామహేశ్వరి భౌతికకాయాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. భౌతికకాయం వెంట బాలకృష్ణ, రామకృష్ణ, నారా లోకేశ్‌ సహా మరికొందరు కుటుంబ సభ్యులు ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లారు.