కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

కడప జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొని నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా..పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కడప ఆజాద్​ నగర్ కాలనీవాసులు ఆటోలో వెళ్తుండగా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి సమీపంలో ప్రమాదం జరిగింది. మృతులను మహమ్మద్(25), హసీనా(25), అమీనా(20), షాకీర్ (10)గా గుర్తించారు.

ప్రొద్దుటూరు, కడపకు చెందిన 11 మంది.. ప్రొద్దుటూరు నుంచి మల్లెలకు ఆటోలో వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆటో లారీని క్రాస్ చేయబోతుండగా.. ఎర్రగుంట్ల నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళా డ్రైవర్‌తో సహా ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు. సమాచారం అందుకున్న జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు, ఎర్రగుంట్ల తహసీల్దార్‌ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు డీఎస్పీ తెలిపారు.