త్వరలో తెలంగాణలో పర్యటించనున్న జేపీ నడ్డా, అమిత్ షా

నెల 30 నుంచి ప్రారంభం కానున్న మహాజన్ సంపర్క్ అభియాన్

JP Nadda and Amit Shah who will soon tour Telangana

హైదరాబాద్‌ః బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా త్వరలో తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెల 30న ప్రారంభం కానున్న మహాజన్ సంపర్క్ అభియాన్‌లో భాగంగా తెలంగాణలో నిర్వహించే రెండు బహిరంగ సభల్లో ఇద్దరు నేతలు పాల్గొంటారు. నెల రోజుల పాటు మహాజన్ సంపర్క్ అభియాన్ నిర్వహించేందుకు బిజెపి నిర్ణయించంది. ఇందులో భాగంగా ఉత్తర, దక్షిణ తెలంగాణలో చెరో ఒక బహిరంగ సభ నిర్వహించేందుకు బిజెపి పార్టీ పెద్దలు ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 23న దేశవ్యాప్తంగా ఉన్న పది లక్షల మంది బూత్‌స్థాయి కార్యకర్తలను ఉద్దేశించి వర్చువల్‌గా ప్రసంగిస్తారు. మోడీ ప్రభుత్వం 9 ఏళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో దేశవ్యాప్తంగా 396 బహిరంగ సభలు ఏర్పాటు చేశామని, వీటిల్లో భాగంగా ఈ వర్చువల్ సమావేశం కూడా ఏర్పాటు చేశామని బిజెపి నేత, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ తెలిపారు. బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన..మహాజన్ సంపర్క్ అభియాన్‌లో భాగంగా వివిధ రంగాల్లో లక్ష మంది ప్రముఖులతో చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి లోక్ సభ నియోజకవర్గం నుంచి ఇందుకోసం 250 ప్రముఖులను ఎంపిక చేసినట్టు తెలిపారు.