ఉక్రెయిన్ పై దాడి చేసే ముప్పు ఇంకా పోలేదు : బైడెన్

దౌత్య చర్చల ద్వారానే సమస్య పరిష్కారించుకోవాలని సూచన

వాషింగ్టన్: ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి రష్యా తన దళాలను వెనక్కు రప్పిస్తోందంటూ ఓపక్క వార్తలు వస్తున్నప్పటికీ… మరోపక్క, ఉక్రెయిన్ పై రష్యా దాడి చేస్తుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఘంటాపథంగా చెబుతున్నారు. దౌత్య చర్యలు, చర్చల ద్వారా ఉక్రెయిన్ సంక్షోభాన్ని ఇప్పటికీ నివారించే అవకాశం ఉందని చెప్పారు. ఒకవేళ రష్యా దండెత్తితే మాత్రం ఆంక్షలను విధించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రష్యాను హెచ్చరించారు.

రష్యా ఇప్పుడు బలగాలను వెనక్కు తీసుకుంటున్నామని చెబుతున్నా.. ఉక్రెయిన్ పై దాడి చేసే ముప్పు ఇంకా పోలేదంటూ విశ్లేషకులు చెబుతున్నారని ఆయన అన్నారు. ఏం జరిగినా దానికి తగ్గట్టు ప్రతిస్పందించేందుకు అమెరికా సిద్ధంగా ఉందన్నారు. ఉక్రెయిన్ పై రష్యా దాడి చేస్తే మాత్రం నిర్ణయాత్మకంగా తాము స్పందిస్తామన్నారు. అలాగే, బలగాల ఉపసంహరణకు సంబంధించి రష్యా తమకు ఆధారాలు చూపించాలని ఆయన డిమాండ్ చేశారు. రష్యా తమకేం శత్రువు కాదని బైడెన్ స్పష్టం చేశారు. దౌత్యచర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని పుతిన్ కు సూచించారు. ఇతర దేశాల భూమి హక్కులు, ప్రాంతీయ సమగ్రతకు హాని కలిగితే మాత్రం తమ సహజ సూత్రాలను మాత్రం వదులుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/