జార్ఖండ్ విద్యాశాఖ మంత్రి కన్నుమూత
చెన్నైః జార్ఖండ్ విద్యాశాఖ మంత్రి జగర్నాథ్ మహతో ఈరోజు చెన్నైలో కన్నుమూశారు. ఆయన మరణంపై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ట్వీట్ చేశారు. మన టైగర్ జగర్నాథ్ దా ఇక లేరు! ఈ రోజు జార్ఖండ్ .. తన గొప్ప ఆందోళనకారులలో ఒకరైన, పోరాట పటిమ, కష్టపడి పనిచేసే, ప్రజాదరణ పొందిన నాయకుడిని కోల్పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని, ఈ కష్ట కాలంలో వారి కుటుంబసభ్యులకు మనో ధైర్యాన్నివ్వాలని కోరుకుంటున్నానని సీఎం రాసుకొచ్చారు.
మహతో గిరిదిహ్లోని డుమ్రీ నియోజకవర్గం నుండి జేఎంఎం ఎమ్మెల్యేగా పనిచేశారు. షిబు సోరెన్ నేతృత్వంలోని ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 2020లో ఆయనకు కొవిడ్ బారిన పడిన తర్వాత ఊపిరితిత్తుల మార్పిడి చేయించుకున్నారు. గత నెలలో జార్ఖండ్ విధానసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మరోసారి అస్వస్థతకు గురైన ఆయనను విమానంలో చెన్నైకి తరలించారు.