జనసేన త్వరలో క్లోజ్ అవుతుంది – ముద్రగడ

mudragada-padmanabham

జనసేన పార్టీ త్వరలోనే క్లోజ్ అవుతుందన్నారు వైసీపీ నేత ముద్రగడ. తాజాగా జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్న ముద్రగడ..తాజాగా మీడియా తో మాట్లాడుతూ జనసేన ఫై తీవ్ర విమర్శలు చేసారు. తనకు నీతి కబుర్లు చెప్పవద్దని గట్టిగానే కొందరికి వార్నింగ్ ఇచ్చారు. తన కుటుంబం రాజకీయాల్లో వచ్చేటప్పటికీ ఇప్పుడున్నవారెవరకీ ఏబీసీడీలు కూడా రావని ఎద్దేవా చేశారు.

తన కుటుంబం 1951లో సినిమాల్లో వచ్చేనాటికి ఇప్పుడున్న నటులు కూడా లేరన్నారు. కొందరు సినిమాల్లో హీరో కావచ్చేమో గానీ రాజకీయాల్లో మాత్రం తాను హీరో అని పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి వ్యంగ్యంగా మాట్లాడారు. రాజకీయాల్లో తాడు, బొంగరం లేనివాడు తనకు పాఠాలు చెబుతున్నాడని మండిపడ్డారు. మీది ఏం పొడుగని మీ వద్దకు రావాలని ప్రశ్నించారు.

తాను రాజకీయాల్లోకి రావడానికి కారణం కాపులు కాదన్నారు. తాను ఏ ఉద్యమాలు చేసినా బీసీలు, దళితులు ముందున్నారన్నారు. అసలు రాజకీయాలు తమ వద్ద నేర్చుకోవాలని సూచించారు. తనపై రకరకాలుగా తప్పుడు పోస్టింగులు పెడుతున్నారని, మీరు చెప్పినట్టు తానెందుకు రాజకీయాలు చేయాలని ప్రశ్నించారు. జనసేన మరో పార్టీలో కలవడం సంగతేమో గానీ త్వరలో క్లోజ్ అవుతుందని ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. పిఠాపురంలో వైసీపీ భారీ విజయం సాదించబోతుందని జోస్యం చెప్పారు.