వైఎస్‌ఆర్‌సిపి విముక్త ఆంధ్రప్రదేశ్‌కు అవసరం ఉందిః నాదెండ్ల మనోహర్

వారాహి యాత్ర గోదావరి జిల్లాల్లో విజయవంతమైందని వెల్లడి

nadendla-manohar

అమరావతిః జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర గోదావరి జిల్లాల్లో ఊహించిన దాని కన్నా ఎక్కువగా విజయవంతమైందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. వారాహి యాత్ర చరిత్రలోనే అద్భుతమైనదని చెప్పారు. జనసేనతో కలిసి నడవాలని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. సోమవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘‘యాత్ర ద్వారా పవన్ అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడి సమాచారం సేకరించారు. రాబోయే రోజుల్లో ఏం చేస్తారో ప్రజలకు వివరించారు” అని అన్నారు. సంస్కారం లేని మనుషులు పాలన చేస్తే రాష్ట్రం ఇలానే ఉంటుందని విమర్శించారు.

‘‘మీలోనే స్పందన లేనప్పుడు స్పందన కార్యక్రమాలు ఎందుకు జగన్ రెడ్డి?’’ అని ప్రశ్నించారు. ప్రశ్నిస్తున్న ప్రజలపై, నాయకులపై వందల సంఖ్యలో కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. పవన్‌పై వైసీపీలో ఇద్దరు, ముగ్గురు మాత్రమే ఎందుకు దూషణలకు దిగుతున్నారని ప్రశ్నించారు. వైఎస్‌ఆర్‌సిపి విముక్త ఆంధ్రప్రదేశ్ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. రెండో విడత వారాహి యాత్ర పశ్చిమ గోదావరిలోనే కొనసాగిస్తామని తెలిపారు. రెండో విడత యాత్రపై త్వరలోనే ప్రకటిస్తామని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.