ఏపీలో ఇళ్ల నిర్మాణంలో అవినీతి..ప్రధానికి పవన్ కల్యాణ్‌ ఫిర్యాదు

విచారణ జరిపించాలంటూ 5 పేజీల లేఖ

janasena-chief-pawan-kalyan-penned-letter-to-modi

అమరావతిః ఏపిలో పేద ప్రజలకు నిర్మించి ఇచ్చే ఇళ్ల ప్రాజెక్టులో భారీ కుంభకోణం జరిగిందని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఈ ఇళ్ల నిర్మాణం, పట్టాల పంపిణీపై ప్రభుత్వం రోజుకో ప్రకటన చేస్తోందని విమర్శించారు. భూ సేకరణలో వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యేలు కీలకంగా వ్యవహరించారని, ఇందులో భారీగా అక్రమాలు జరిగాయని పవన్ కల్యాణ్ ఆరోపించారు. కేంద్రం జోక్యం చేసుకుని సీబీఐతో విచారణ జరిపించాలని పవన్ డిమాండ్ చేశారు. ఈమేరకు శనివారం ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన లేఖ రాశారు. ఐదు పేజీల ఈ లేఖలో జగన్ సర్కారుపై పలు ఆరోపణలు గుప్పించారు.

పేదలకు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి భూసేకరణకు ప్రభుత్వం రూ.32,141 కోట్ల నిధులను విడుదల చేసిందని పవన్ కల్యాణ్ చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన భూ సేకరణలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు కీలకంగా వ్యవహరించారని చెప్పారు. ఈ క్రమంలోనే భారీ అవినీతికి తెరతీశారని మండిపడ్డారు. గతంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు అందించలేదని చెప్పారు. మొత్తంగా 6.68 లక్షల టిడ్కో ఇళ్లు నిర్మాణం పూర్తవగా.. అందులో కేవలం 86,984 మందికి మాత్రమే అందించారని పవన్ కల్యాణ్ ఆరోపించారు.