అరెస్టయిన జన సైనికులను శాలువాతో సన్మానించిన జనసేనాధినేత

ఇటీవల అరెస్ట్ అయ్యి బెయిల్ ఫై విడుదలైన జనసేన నేతలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘనంగా సన్మానించారు. పీఏసీ సమావేశానికి హజరయ్యేందుకు విజయవాడ వచ్చిన పవన్ కళ్యాణ్ శనివారం మంగళగిరి పార్టీ ఆఫీస్ లో విశాఖకు చెందిన నేతలతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. కాగా వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో వైస్సార్సీపీ నేతలపై దాడి చేశారనే ఆరోపణలపై కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగిన సంగతి తెలిసిందే. హైకోర్టు ద్వారా బెయిల్ ఫై వారంతా బయటకు వచ్చారు.

ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ బెయిల్ ఫై బయటకు వచ్చిన నేతలను మంగళగిరి ఆఫీస్ కు పిలిపించుకొని వారితో మాట్లాడారు. ఆ నేతలకు శాలువాలను కప్పి పవన్ ఘనంగా సత్కరించారు. అరెస్ట్ సందర్భంగా వారు ఎదుర్కొన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులోనూ ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదని, పార్టీ అన్ని రకాలుగా అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.