జగన్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే..!!
ఏపీ సీఎం జగన్ ఫై శనివారం రాత్రి దాడి జరిగిన సంగతి తెలిసిందే. మేమంతా సిద్ధం బస్సుయాత్రలో భాగంగా సింగ్నగర్కు చేరుకున్న క్రమంలో జగన్పై రాయితో దాడి చేశారు. బస్సుపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి రాయి విసరడంతో జగన్ కనుబొమ్మకు తాకింది. ప్రథమ చికిత్స తర్వాత మళ్లీ బస్సుయాత్ర కొనసాగింది. అనంతరం వైద్యుల సలహామేరకు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి సీఎం జగన్ బయల్దేరారు. ఇక జగన్పై జరిగిన దాడిపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీ స్పందించారు. జగన్పై దాడిని ప్రధాని ఖండించారు.జగన్ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని ప్రధాని ఆకాంక్షించారు.
ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు దిగ్ర్భాంతికి గురయ్యారు. దాడిని నిరసిస్తూ ఆయా ప్రాంతాల్లో పార్టీ నేతలు రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు. దాడిని తీవ్రంగా ఖండిస్తూ నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండు చేస్తున్నారు. ప్రస్తుతం జగన్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, గాయానికి కుట్లు వేసినట్లు డాక్టర్స్ తెలిపారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కాస్త రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని అన్నారు. ఇక గాయం కారణంగా గుడివాడలో జరగాల్సిన ‘మేమంతా సిద్ధం’ సభ రేపటికి వాయిదా పడింది.