ఫినిక్స్ రియల్ ఎస్టేట్ సంస్థలో ఐటీ సోదాలు

ఫినిక్స్ రియల్ ఎస్టేట్ సంస్థలో ఐటీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. నానక్ రామ్ గూడ, గోల్ఫ్ ఎడ్జ్ , మాదాపూర్ లోని ఫీనిక్స్ ఐటీ సెజ్ లలో ఉన్న ఫీనిక్స్ కార్యాలయాల్లో తెల్లవారుజామున తనిఖీలు నిర్వహించారు. దాదాపు నాలుగు గంటల పాటు సోదాలు కొనసాగాయి. 25 మంది అధికారులు పెద్ద ఎత్తున సోదాలు చేసారు. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. కంపెనీకి చెందిన మొత్తం 20 చోట్ల ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి.

పలుచోట్ల వెంచర్స్, రియల్ ఎస్టేట్ ఇన్ ఫ్రాలో పెట్టుబడులు పెట్టింది ఫీనిక్స్. సంస్థ చైర్మెన్ , డైరెక్టర్ల నివాసాల్లోనూ ఐటీ అధికారుల సోదాలు జరుగుతున్నాయి. మాదాపూర్ లోని ఐటీ సెజ్ లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఫినిక్స్ సంస్థ చైర్మెన్ చుక్కపల్లి సురేష్ కు రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులతో మంచి సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ సంస్థలో చాలా మంది రాజకీయ ప్రముఖులు పెట్టుబడులు పెట్టారని సమాచారం. ఐటీని ఎగ్గొట్టారనే ఆరోపణలు రావడంతో సోదాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఫీనిక్స్ గ్రూప్ దాదాపు లక్షా 50 వేల కోట్ల వ్యాపారం చేస్తుందని తెలుస్తోంది. వివిధ ప్రాజెక్టుల పేరిట తీసుకున్న లోన్స్.. ఆయా ప్రాజెక్టులకే ఖర్చు పెట్టారా ? ఇతర కార్యకలాపాలకు దారిమళ్లించారా? అనే కోణంలో వారిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కాగా, దీనికి సంబంధించిన ఐటీ అధికారుల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.