మరో టీఆర్ఎస్ నేత ఆఫీస్ లో ఐటీ దాడులు
టిఆర్ఎస్ నేతల ఫై వరుస ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు మంత్రుల ఇళ్లలో , ఆఫీస్ లలో ఐటీ దాడులు జరుగగా..మంగళవారం కూకట్పల్లి నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ నేత మందాడి శ్రీనివాసరావు కార్యాలయంలో మంగళవారం ఉదయం నుంచి ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మందాడి శ్రీనివాసరావుకు చెందిన శ్రీ హర్ష కన్స్ట్రక్షన్ ఆఫీసులో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తోన్నారు. ఆఫీసును తమ ఆధీనంలోకి తీసుకుని విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ తరపున కేపీహెచ్బీ కార్పొరేటర్గా ఆయన ఉన్నారు.
గతంలో టీడీపీలో ఉన్న ఆయన.. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇటీవల కరీంనగర్లో మంత్రి గంగులకు చెందిన గ్రానైట్ కంపెనీలు, ఇళ్లల్లో ఐటీ, ఈడీ ఉమ్మడిగా సోదాలు నిర్వహించాయి. గంగుల కమలాకర్ ఇంటి తాళం పగలకొట్టి అధికారులు తనిఖీలు చేశారు. అక్రమంగా గ్రానైట్ను ఇతర దేశాలకు తరలించారనే ఆరోపణలతో గతంలో మంత్రి గంగులకు చెందిన కంపెనీలపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఆయనకు చెందిన మూడు గ్రానైట్ కంపెనీలకు నోటీసులు ఇచ్చింది. అటు టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ రవిచంద్ర ఇంట్లో కూడా ఐటీ, ఈడీ దాడులు చేపట్టింది. హైదరాబాద్ శ్రీనగర్లోని రవిచంద్ర ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఇలా వరుస పెట్టి టిఆర్ఎస్ నేతల ఇళ్లలో , ఆఫీస్ ల్లో ఐటీ దాడులు జరగడం చర్చ కు దారి తీస్తుంది.