మంత్రి హరీష్ రావు ఫై సీఎం కేసీఆర్ ప్రశంసలు

తెలంగాణ సీఎం కేసీఆర్..మంత్రి హరీష్ రావు ఫై ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలోని ఎనిమిది కొత్త జిల్లాలో నిర్మించిన మెడికల్‌ కాలేజీలను కేసీఆర్ వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ప్రగతి భవన్‌ నుంచి ఆయా కాలేజీలకు సీఎం ప్రారంభోత్సవం చేశారు.

మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్‌కర్నూల్‌, మహబూబాబాద్‌, కొత్తగూడెం, సంగారెడ్డిలో కొత్తగా నిర్మించిన కాలేజీలను ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, పలువురు సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వైద్య విద్యార్థులకు, సిబ్బందికి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు కృషి చేసిన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావుపై ప్రశంసలు కురిపించారు. ‘తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇదో సువర్ణ అధ్యాయం. ఒకనాడు అనేక సమస్యలతో తాగు, సాగునీటికి, కరెంటు, మెడికల్‌ సీట్లు, ఇంజినీరింగ్‌ సీట్లకు ఎన్నో రకాల అవస్థలుపడ్డ తెలంగాణ ప్రాంతం స్వరాష్ట్రమై అద్భుతంగా ఆత్మగౌరవంతో బతుకుతోంది. దేశానికే మార్గదర్శకమైనటువంటి అనేక వినూత్న కార్యక్రమాలు చేపడుతూ ముందుకెళ్తున్నాం. నేడు ఎనిమిది కళాశాలలను ప్రారంభించుకోవడం అందరికీ గర్వకారణం’ అన్నారు.

మహబూబాబాద్‌, వనపర్తిలాంటి మారుమూల ప్రాంతాల్లో ప్రభుత్వ కళాశాలలు, వైద్య కళాశాలలు వస్తాయని ఎవరూ కలలో ఊహించలేదని,.వీటన్నింటికి కారణం సొంత రాష్ట్రం ఏర్పాటుకావడమే అన్నారు. స్వరాష్ట్ర ఏర్పాటుతో ఉద్యమకారులుగా పని చేసిన బిడ్డలే తెలంగాణ పరిపాలనా సారథ్యం స్వీకరించడం, అందులో ప్రముఖ ఉద్యమకారుడు, మంత్రి హరీష్ రావు వైద్య ఆరోగ్య శాఖను నిర్వహిస్తూ కళాశాలలను తీసుకువచ్చేందుకు చేసిన కృషి అపూరపమైనది ముఖ్యమంత్రి కొనియాడారు.