ఢిల్లీలోని ఇజ్రాయెల్‌ ఎంబసీ వద్ద పేలుడు.. సీసీటీవీ కెమెరాకు చిక్కిన అనుమానితులు

Israel embassy ‘blast’: 2 suspects caught on CCTV, counter-terror teams at spot

న్యూఢిల్లీః ఢిల్లీలోని ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయం సమీపంలో పేలుడు కలకలం రేపింది. ఇప్పటికే ఇద్దరు అనుమానితులను సీసీటీవీ కెమెరా దృశ్యాల ఆధారంగా గుర్తించిన అధికారులు వారిని పట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు మొదలుపెట్టారు. మరోవైపు ఎంబసీ వద్ద ఎన్ఎస్జీ డాగ్ స్క్వాడ్, పోరెన్సిక్ బృందాలు దర్యాప్తు చేపట్టాయి. ఎన్ఐఏ రంగంలోకి దిగి ఎంబసీ వెలుపల విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ రాయబారిని దుర్భాషలాడుతూ రాసిన లేఖను ఎంబసీ సమీపంలో అధికారులు గుర్తించారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించిన అధికారులు ఇజ్రాయెల్‌కు చెందిన ఇతర సంస్థల వద్ద భద్రతను పెంచారు.

మరోవైపు తమ రాయబార కార్యాలయం సమీపంలో పేలుడుపై ఇజ్రాయెల్‌ జాతీయ భద్రతా మండలి స్పందించింది. దీనిని ఉగ్రదాడిగా అనుమానించిన మండలి ఈ ఘటన నేపథ్యంలో భారత్‌లోని తమ పౌరుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది. జాగ్రత్తగా ఉండాలంటూ వారికి సూచించింది. మార్కెట్లు, షాపింగ్‌ మాల్స్‌ వంటి బహిరంగ ప్రదేశాలకు వెళ్లడం తగ్గించాలని సలహా ఇచ్చింది. ఇజ్రాయెల్‌ గుర్తులను ప్రదర్శించకుండా ఉండాలని కోరింది.