జీ20 సమావేశాన్ని వ్యతిరేకించిన చైనా.. తీవ్రంగా స్పందించిన భారత్‌

మా భూభాగంలో ఎక్కడైనా నిర్వహిస్తామని చైనాకు తేల్చిచెప్పిన కేంద్రం

India’s Sharp Response As China Opposes G20 Meet In Kashmir

న్యూఢిల్లీః జమ్మూకశ్మీర్‌ లోని శ్రీనగర్‌లో మే 22, 23, 24, తేదీల్లో జరగనున్న జీ 20(G20) సమావేశాల కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ సమావేశాల సందర్భంగా కశ్మీర్ లో సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేసింది. ఈ క్రమంలో జీ 20 సదస్సును కశ్మీర్ లో నిర్వహించడంపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్ బిన్ మాట్లాడుతూ.. జీ 20 వంటి అంతర్జాతీయ సదస్సును కశ్మీర్ లాంటి వివాదాస్పద ప్రాంతంలో నిర్వహించడం సరికాదు. దీనికి నిరసనగా చైనా ఈ సమావేశాలకు హాజరుకాబోదని చెప్పారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ చైనాకు కౌంటర్ ఇచ్చింది.

ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక సదస్సును నిర్వహించే అవకాశం భారత్ కు దక్కిందని, ఈ సదస్సును తమ భూభాగంలో ఎక్కడైనా నిర్వహించుకునే స్వేచ్ఛ తమకు ఉందని స్పష్టం చేసింది. దేశ సరిహద్దుల్లో శాంతి నెలకొన్నప్పుడే చైనాతో సంబంధాలు సాధారణంగా ఉంటాయని తేల్చిచెప్పింది. సదస్సు కోసం వచ్చే ప్రతినిధుల భద్రతను దృష్టిలో పెట్టుకుని శ్రీనగర్ లో సెక్యూరిటీ పెంచినట్లు వివరించింది. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ తో పాటు పారామిలటరీ బలగాలతో సెక్యూరిటీ ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు. కాగా, ఈ సదస్సులో పాల్గొనేందుకు చైనా విముఖత వ్యక్తం చేసింది. తుర్కియే, సౌదీ అరేబియా ఇప్పటి వరకూ రిజిస్టర్ చేసుకోలేదని అధికారులు వివరించారు.