స్వాతంత్ర్య దినోత్సవం..ఎర్రకోటలో 1800 ప్రత్యేక అతిథులు

వివిధ వృత్తులకు చెందిన వారిని ఆహ్వానించిన ప్రభుత్వం

Independence Day 2023.. 1,800 special guests invited at Red Fort

న్యూఢిల్లీః భారత 77వ స్వాతంత్ర్య దినోత్సవంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ఢిల్లీలోని ప్రఖ్యాత ఎర్రకోటపై మువ్వన్నెల జెండాను ఎగురవేయనున్నారు. ఈ వేడుకల కోసం వివిధ వృత్తులకు చెందిన సుమారు 1800 మంది వ్యక్తులు, వారి జీవిత భాగస్వాములను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించింది. ఈ ప్రత్యేక అతిథుల జాబితాలో 660 గ్రామాలకు చెందిన 400 మంది సర్పంచ్‌లు ఉన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంస్థల పథకంలో భాగమైన వారిలో 250 మంది, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం నుంచి 50 మంది, ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజనలో మరో 50 మందికి ఆహ్వానం లభించింది.

కొత్త పార్లమెంట్ భవనం సహా సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌ నిర్మాణంలో భాగమైన 50 మంది నిర్మాణ కార్మికులు, ఖాదీ కార్మికులు, సరిహద్దు రోడ్ల నిర్మాణం, అమృత్ సరోవర్, హర్ ఘర్ జల్ యోజన తయారీలో భాగమైన 50 మంది చొప్పున వేడుకలకు హాజరు కానున్నారు. అలాగే 50 మంది చొప్పున ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, నర్సులు, మత్స్యకారులకు కూడా ఎర్రకోటలో స్వాతంత్ర్య దినోత్సవంలో పాల్గొనే అవకాశం లభించింది. కాగా, ప్రభుత్వ జన్ భగీదరి దార్శనికతకు అనుగుణంగా ఇలాంటి సామాన్య ప్రజలను స్వాతంత్ర్య దినోత్సవ వేడులకు ఆహ్వానించినట్టు రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం నుంచి 75 మంది దంపతులను తమ సంప్రదాయ దుస్తులలో ఎర్రకోటలో జరిగే వేడుకను చూసేందుకు ఆహ్వానించారు.