తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నం ఆవిష్కరణ వాయిదా
![](https://www.vaartha.com/wp-content/uploads/2024/05/CM-Revanth-Reddy-review-meeting-on-state-emblem-and-anthem-today.jpg)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర చిహ్నం కొత్త లోగో ఆవిష్కరణను కాంగ్రెస్ ప్రభుత్వం వాయిదా వేసింది. చివరి నిమిషంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నది. తెలంగాణ తల్లి, కొత్త చిహ్నం ఆవిష్కరణపై సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు తెలిపింది. ఈ కారణంగా జూన్ 2న తెలంగాణ రాష్ట్ర దశాబ్ధి ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా కేవలం తెలంగాణ గీతాన్ని మాత్రమే ఆవిష్కరిస్తున్నట్లు స్పష్టం చేసింది.
తెలంగాణ రాష్ట్ర గీతం, చిహ్నం విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్నిరోజులుగా ప్రముఖులతో చర్చలు జరుపుతున్నారు. ప్రజల పోరాటం, త్యాగాలు ప్రతిబింబించేలా రాష్ట్ర చిహ్నం రూపుదిద్దుకోనున్నట్లు చెబుతున్నారు. అయితే రాష్ట్ర చిహ్నంలో కాకతీయ తోరణం, చార్మినార్ను తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారని… ఇది సరికాదని బీఆర్ఎస్ వర్గాలు మండిపడుతున్నాయి. కాగా, ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, తెలంగాణ ప్రజల్లో ఓ వర్గం నుంచి వస్తున్న వ్యతిరేకతతో ప్రభుత్వం పునరాలోచనలో పడిందనే టాక్ కూడా గట్టిగానే నడుస్తోంది.