సోషల్ మీడియా యూజర్లతో ముచ్చటించిన కమల

తనకు నచ్చిన వంటకాలను వెల్లడించిన వైనం

Kamala-Harris

వాషింగ్టన్‌: అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న భారత సంతతి మహిళ కమల హారిస్ పోలింగ్ ముంగిట సోషల్ మీడియాలో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తనకు బాగా నచ్చిన దక్షిణ భారతదేశ వంటకం అంటే ఇడ్లీ సాంబారేనని స్పష్టం చేశారు. ఉత్తర భారతదేశ వంటకాల్లో అన్ని రకాల టిక్కాలను ఇష్టపడతానని వివరించారు.

తనకు వంట చేయడం అంటే చాలా ఇష్టమని, అప్పుడప్పుడు తన భర్త డగ్లస్ కు వంట నేర్పిస్తుంటానని తెలిపారు. ఉదయాన్నే లేచిన తర్వాత వ్యాయామం తప్పకుండా చేస్తానని, ఆపై పిల్లలతో ఉల్లాసంగా గడుపుతానని తెలిపారు. అంతేకాదు, మహిళా సాధికారత పైనా ఆమె స్పందించారు. మహిళలు జీవితంలో ముందుకెళ్లాలంటే అందుకు ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. జీవితంలో ఎన్నో తిరస్కారాలు చవిచూశానని, వాటన్నింటినీ పట్టించుకోకపోతేనే అనుకున్నది సాధించగలమని తెలిపారు. అమెరికా అధ్యక్ష పదవికి నవంబరు 3న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే.


తాజా జాతీయ వార్తల కోసం కిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/