కెప్టెన్ వరుణ్ సింగ్ మృతి పట్ల రాష్ట్రపతి, ప్రధాని సంతాపం
న్యూఢిల్లీ: తమిళనాడులో ఈ నెల 8న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో తీవ్రగాయాలతో బయటపడి ఇన్నిరోజులుగా బెంగళూరులోని కమాండ్ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడిన కెప్టెన్ వరుణ్ సింగ్ మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే వరుణ్ సింగ్ తుది శ్వాస విడవడంపై రాష్ట్రపతి, ప్రధానితో సహా పలువురు కేంద్ర మంత్రులు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ మాతృభూమి కోసం అత్యంత ధైర్య పరాక్రమాలతో ఆయన సేవలు చేశారని కొనియాడారు.
ఈ దేశం ఆయనకు ఎంతో రుణపడి ఉంటుంది. ఆయన చూపిన ధైర్య సాహసాలు, పరాక్రమం అద్భుతమైనవి. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను అని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ అన్నారు.
కెప్టెన్ వరుణ్ సింగ్ మృతి చెందడం చాలా బాధగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. అత్యంత గర్వంగా, వృత్తి నిపుణతతో ఈ మాతృభూమికి సేవలు చేశారని ట్విట్టర్ వేదికగా ప్రధాని కొనియాడారు. ఆయన మరణించడం చాలా బాధగా ఉందని, దేశం కోసం ఆయన చేసిన సేవలు ప్రజలెప్పటికీ మరిచిపోరని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నానని మోడీ ట్వీట్ చేశారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/