ముద్రగడ జనసేనలో చేరుతారనే దాని గురించి నాకు తెలియదుః వైవీ సుబ్బారెడ్డి

కుటుంబాల పరంగా తాము టికెట్లు ఇవ్వమని వ్యాఖ్య

yv-subbareddy

అమరావతిః కాపు నేత ముద్రగడ పద్మనాభం జనసేనలో చేరుబోతున్నారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలపై వైఎస్‌ఆర్‌సిపి రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. ముద్రగడ జనసేనలో చేరుతున్నారనే దాని గురించి తనకు తెలియదని చెప్పారు. కుటుంబంలో అర్హులైన వారు ఉంటే వారికి టికెట్లు ఇస్తామని తెలిపారు. కుటుంబాల పరంగా తాము టికెట్లు ఇవ్వమని.. ప్రజాబలం ఉన్నవారికే టికెట్లు ఇస్తామని అన్నారు. 175 స్థానాల్లో విజయం సాధించేందుకే మార్పులు, చేర్పులు చేస్తున్నామని చెప్పారు. నిన్న 20 స్థానాల్లో మార్పులు చేశామని తెలిపారు.

టిడిపి హయాంలో బీసీలకు అన్యాయం జరిగిందని… బీసీలకు సీఎం జగన్ ఎంతో ప్రాధాన్యతను ఇస్తున్నారని సుబ్బారెడ్డి చెప్పారు. విశాఖ శుభ్రతపై జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. పరిశుభ్రతలో విశాఖకు అవార్డు దక్కడం సంతోషంగా ఉందని చెప్పారు. జాతీయ స్థాయిలో ఫైవ్ స్టార్ రేటింగ్స్ తో నాలుగు కార్పొరేషన్లు క్లీన్ సిటీ అవార్డులను సొంతం చేసుకున్నాయని అన్నారు. విశాఖ నార్త్ నియోజకవర్గంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.