600 కార్లతో కూడిన భారీ కాన్వాయ్ తో మహారాష్ట్రకు బయల్దేరిన కెసిఆర్
కెసిఆర్ వెంట ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నేతలు
హైదరాబాద్ః బిఆర్ఎస్ అధినేత, సిఎం కెసిఆర్ మహారాష్ట్ర పర్యటనకు బయల్దేరారు. రెండు ప్రత్యేక బస్సులు, 600 కార్లతో కూడిన భారీ కాన్వాయ్ తో ఆయన రోడ్డు మార్గంలో పయనమయ్యారు. ఆయన వెంట మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు ఉన్నారు. రెండు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగనుంది.
మధ్యాహ్నం 1 గంటలకు మహారాష్ట్రలోని ధారిశివ్ జిల్లాలోని ఒమర్గాకు వీరంతా చేరుకుంటారు. అక్కడ భోజనం చేసి సాయంత్రం 4.30 గంటలకు సోలాపూర్ కు బయల్దేరుతారు. ఈ రాత్రికి సోలాపూర్ లోనే బస చేస్తారు. రేపు ఉదయం 8 గంటలకు సోలాపూర్ నుంచి పండరీపురంకు చేరుకుని… అక్కడి విఠోభారుక్మిణి మందిర్ లో కెసిఆర్, ఇతర నేతలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
ఆ తర్వాత సోలాపూర్ జిల్లా సర్కోలిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో పాల్గొంటారు. ఈ సభలోనే ప్రముఖ నేత భగీరథ్ బాల్కే సహా పలువురు నేతలు బిఆర్ఎస్ లో చేరనున్నారు. అనంతరం ధారాశివ్ జిల్లాలో కొలువైన తుల్జాభవాని అమ్మవారిని (శక్తిపీఠం) దర్శించుకుని హైదరాబాద్ కు తిరుగుపయనమవుతారు.