రాహుల్‌పై పరువు నష్టం దావా వేస్తా : సిఎం హిమంత బిశ్వ శర్మ

అదానీ గ్రూప్ కు, హిమంత బిశ్వ శర్మకు లింక్ పెడుతూ రాహుల్ ట్వీట్

Himanta: Will file defamation suit against Rahul

న్యూఢిల్లీః ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ గ్రూప్ తో తనకు లింక్ పెడుతూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ పై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మండిపడ్డారు. పరువు నష్టం దావా వేస్తానంటూ రాహుల్ ను హెచ్చరించారు. గువాహటిలో మీడియాతో ఆయన మాట్లాడుతూ… ఏప్రిల్ 14న ప్రధాని మోడీ అసోం పర్యటన ముగిసిన తర్వాత రాహుల్ పై పరువు నష్టం దావా వేస్తానని చెప్పారు. రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ ముమ్మాటికీ తన పరువు, ప్రతిష్టకు భంగం కలిగించేదే అని అన్నారు. ప్రధాని అసోం నుంచి వెళ్లిన వెంటనే రాహుల్ ట్వీట్ పై చర్యలు తీసుకుంటానని, గువాహటిలో పరువునష్టం దావా వేస్తానని చెప్పారు. ఈ అంశంపై ప్రస్తుతం తాను ఇంతకంటే ఎక్కువ స్పందించనని, రాజకీయాలు మాట్లాడబోనని…. ఎందుకంటే ఇప్పుడు బిహు పండుగ వేడుకలను నిర్వహించుకోవాలని చెప్పారు.

కాగా, అదానీ అంశంపై రాహుల్ ఓ ట్వీట్‌ చేశారు. అదానీ గ్రూప్స్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ తో హిమంత బిశ్వ శర్మకు సంబంధాలు ఉన్నాయని ఆ ట్వీట్‌లో ఆరోపించారు. ‘వాళ్లు నిజాన్ని దాచిపెట్టారు. అందుకే రోజూ తప్పుదోవ పట్టిస్తున్నారు. అదానీ కంపెనీల్లో రూ.20,000 కోట్లు బినామీ సొమ్ము ఎవరిది..? అన్న ప్రశ్న ఇంకా అలాగే మిగిలే ఉంది’ అని ట్వీట్‌ చేశారు.