నేడు హైదరాబాద్‌లో అతిభారీ వర్షం..రెడ్ అలెర్ట్ జారీ

ఐదు జోన్ల పరిధిలో భారీ నుంచి అతి భారీ వర్షం

heavy-to-very-heavy-rain-expected-in-hyderabad-today

హైదరాబాద్‌ః నేడు హైదరాబాద్‌లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ వాతావరణశాఖ జోన్ల వారీగా హెచ్చరికలు జారీ చేసింది. చార్మినార్, ఖైరతాబాద్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి జోన్ పరిధిలో భారీ నుంచి అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఆయా జోన్లలో గంటకు 3 నుంచి 5 సెంటీమీటర్ల వరకు, కొన్ని ప్రాంతాల్లో 5 నుంచి 10 సెంటీమీటర్ల వరకు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే, గంటకు 10 నుంచి 14 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది.

భారీ వర్షం కారణంగా చెట్లు కూలతాయని, విద్యుత్ స్తంభాలు దెబ్బతిని కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. రోడ్లు జలమయం అవుతాయని, ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయని పేర్కొంటూ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. పైన పేర్కొన్న ఐదు జోన్ల పరిధిలో రేపు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని వివరించింది. శుక్ర, శనివారాల్లో మాత్రం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.