బంగాళాఖాతంలో కొనసాగుతోన్న ద్రోణి..రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో కొనసాగుతోన్న ద్రోణి ప్రభావం..నైరుతి రుతుపనాల ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ లో రానున్న మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని తెలిపింది. గాలులు దిగువ స్థాయిలో పశ్చిమ దిశ నుంచి తెలంగాణ మీదుగా వీస్తున్నాయని.. దాంతో వర్షలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

ఇటు ఏపీలో ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. పొలం పనులు చేసే రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
నేడు పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశ ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు.